వ్యక్తివాదం పుట్టినది ఆదిమ సమాజంలోనే కానీ ఆధునిక సమాజంలో కాదు - కొడవటిగంటి కుటుంబరావు
వైయుక్తికవాదానికి ఆధునికత పేరు పెట్టి వైయుక్తికవాదం పేరుతో మార్క్సిజాన్ని విమర్శించడం కొంత మంది స్వయంప్రకటిత ఆధునికాంతరవాదుల స్టైల్. వైయుక్తికవాదంలో గానీ, ఆధునికాంతరవాదంలో గానీ కొత్తదనం ఏమీ లేదు. అవి పాత భావజాలానికి కొత్త పేర్లు. వైయుక్తికవాదం ప్రబలంగా ఉన్న సమాజంలో మనిషి ఇతరులని కంటే తనని తానే ఎక్కువగా నమ్ముతాడు. వైయుక్తికవాదాన్ని పూర్తిగా అధిగమించే స్థాయికి మన సమాజం ఇంకా ఎదగలేదు. సమాజం అభివృద్ధి చెందని ఆటవిక దశలో మనిషి తనని తానే ఎక్కువగా నమ్ముకోవడం విచిత్రం కాదు. అప్పట్లో మనిషి తన తరువాత తన సమూహాన్ని ఎక్కువగా నమ్మేవాడు. ఒక సమూహం నుంచి తప్పిపోయిన మనిషి ఇంకో సమూహంలో చేరే అవకాశం ఉండేది కాదు. అప్పట్లో కొత్త సమూహం నుంచి వచ్చిన వ్యక్తిని నమ్మేవాళ్ళు కాదు. అతను పని చెయ్యగలడు అనిపిస్తే అతని చేత కొన్ని రోజులు పని చెయ్యించి చూసి ఆ తరువాత అతన్ని తమ సమూహంలో చేర్చుకోవాలా, వద్దా అనేది నిర్ణయించుకునేవాళ్ళు. ఆటవిక దశలో కూడా మనుషులకి పరలోకం, పునర్జన్మ లాంటి ఊహలు ఉండేవి. పూర్వం ఒక మనిషి చనిపోతే అతని ఆయుధాలు, ఇతర పనిమట్లని అతని శవంతో పాటు పాతి పెట్టేవాళ్ళు. పరలోకంలో కూడా అతనితో పాటు అతని పనిమట్లు ఉండాలని భావించి అతని పనిమట్లని అతని శవం పక్కన పాతి పెట్టేవాళ్ళు. ఆ పనిమట్లన్నీ రాళ్ళు లేదా ఎముకలతో చేసిన పనిమట్లే. అయినా ఆ పనిమట్లు పరలోకంలో అతనికి తోడుగా ఉండాలని భావించి వాటిని అతని శవం పక్కన పాతిపెట్టేవాళ్ళు. అలాగే యజమాని శవం పక్కన బానిసలనీ, స్త్రీలనీ పాతిపెట్టిన సందర్భాలు కూడా ఉండేవి. అటువంటి సమాధులు ఈజిప్ట్లో బయటపడ్డాయి. యజమాని బానిసని తన సొంత ఆస్తిని చూసినట్టు చూడడాన్ని బట్టి అప్పట్లో వైయుక్తికవాదం ఎంత బలంగా ఉండేదో అర్థమైపోతుంది. కొడవటిగంటి కుటుంబరావు గారు వ్రాసిన "వ్యక్తివాదానికి పుట్టిల్లు ఆటవిక సమాజం" అనే వ్యాసం చదివినప్పుడు ఈజిప్షియన్ సమాధులు గుర్తొచ్చాయి. వ్యక్తివాదం ఆధునికమైనదనే వాదనలో నిజం లేదని చెప్పడానికి కుటుంబరావు గారు ఆ వ్యాసం వ్రాసారు.
