మన పాలకులు తిరుపతికీ, శ్రీశైలానికీ వందలాది ప్రత్యేక బస్సులు నడుపుతున్నది ఇందుకే
నిన్న టివిలో కంచ ఐలయ్య హిందూ మతాన్ని విమర్శిస్తూ వ్రాసిన ఒక పుస్తకంపై చర్చ జరిగింది. పల్లెటూర్లలో చదువురాని దళితుడు మంత్రాలు చదివి చేతబడి చేశాడంటే నమ్ముతారు కానీ బాగా చదువుకున్న అగ్రకులంవాడు చేతబడి చేశాడంటే ఎవరూ నమ్మరు అని ఒక వక్త అన్నాడు. కంచ ఐలయ్య కూడా ఇదే మాట అన్నాడు. వాళ్ళు చెప్పినది నిజమే కానీ అది విన్న తరువాత నేను నవ్వు ఆపుకోలేక చచ్చాను. ప్రభుత్వం ఒక వైపు ప్రజలని మూఢ నమ్మకాలని నమ్మొద్దు అని చెపుతోంది. కానీ అదే ప్రభుత్వం తిరుపతికీ, శ్రీశైలానికీ వందలాది ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మూఢ నమ్మకాలంటే కేవలం దెయ్యాలు, చేతబడులు మాత్రమేనా? దేవుళ్ళనీ, బాబాలనీ నమ్మడం మాత్రం మూఢ నమ్మకం కాదా అనే సందేహం వస్తోంది. కావాలని మూఢ నమ్మకాలని పోషించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమిటి? అని అడుగుతారు. ఇక్కడే అసలు విషయానికి సమాధానం దొరుకుతుంది.
1978 నుంచి మన పాలకులు ప్రతి గ్రామానికీ బస్సు నడుపుతామని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ విశాఖపట్నం, ఆదిలాబాద్ జిల్లాలలో ఇప్పటికీ వెయ్యికి పైగా గ్రామాలకి బస్సులు లేవు. కానీ తిరుపతికీ, శ్రీశైలానికీ నిత్యం కొత్త బస్సులు వస్తున్నాయి. పల్లె ప్రాంతాలలో అంత ట్రాఫిక్ ఉండదు అని కొందరు సమాధానం చెప్పొచ్చు కానీ మేము పల్లెటూరులో ఉండే రోజుల్లో రాజోలు నుంచి అమలాపురం వెళ్ళే బస్సులు నిత్యం రద్దీగానే వెళ్ళేవి. RTC వాళ్ళకి బస్సుల సంఖ్య పెంచమన్నా పెంచలేదు. అవసరమైన చోట బస్సుల సంఖ్య పెంచనివాళ్ళు తిరుపతికీ, శ్రీశైలానికీ మాత్రమే బస్సుల సంఖ్య ఎందుకు పెంచుతున్నట్టు? దేవుణ్ణి ఎంత బలంగా నమ్మేవాడైనా నిత్యం అదే నమ్మకాన్ని పట్టుకుని వేలాడడు, అంత కంటే తన భౌతిక అవసరాల గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. అయినా మన పాలకులు వ్యక్తిగత నమ్మకాలకే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు? TTD చేత ప్రత్యేక భక్తి చానెల్ కూడా ఎందుకు పెట్టించినట్టు? కేవలం వ్యక్తిగత విశ్వాసాల వల్ల సమాజం అభివృద్ధి చెందుతుందా? చెందదు, కానీ మన పాలకులు వ్యక్తిగత నమ్మకాలని ఎందుకు అంతలా ప్రోత్సహిస్తున్నట్టు?
పాలక వర్గంవాళ్ళు తమ సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తారు కానీ ప్రజల అవసరాలు తీర్చరు. తాము భౌతిక అవసరమైన డబ్బుని నమ్ముకుంటారు కానీ ప్రజలని మాత్రం ఊహాజనితమైన దేవుణ్ణీ, స్వర్గనరకాలనీ నమ్మమంటారు. ఆ నమ్మకాలని ప్రజలలో పెంపొందించడానికే తిరుపతికీ, శ్రీశైలానికీ ప్రత్యేక బస్సులు నడుపుతారు. ప్రజల భౌతిక అవసరాలు తీర్చకపోతే ఎందుకు తీర్చలేదు అని ప్రజలు పాలకులని అడుగుతారు. ప్రజలు పాలకులని అలా అడగకూడదంటే కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో వాళ్ళ మనసులని దారిమళ్ళించాలి. మన పాలక వర్గంవాళ్ళు చేస్తున్నది ఇదే. ఒక నియోజక వర్గంలో మెజారిటీ అయిన రెండుమూడు కులాలవాళ్ళని సంతృప్తి పరచడంలో అన్ని పాలకవర్గ పార్టీల అభిప్రాయాలూ ఒకేలాగ ఉంటాయి. కానీ ప్రజల భౌతిక అవసరాలు తీర్చే విషయంలో ఏ రెండు పాలక వర్గ పార్టీల అభిప్రాయాలూ ఒకేలాగ ఉండవు. ప్రజల మనసులని కులం, మతం లాంటి ఊహాజనితమైన విషయాల వైపు దారిమళ్ళించడం ఏ రకంగానూ ప్రజాస్వామ్యం కాదు.